Union govt on Retrospective act | వివాదాస్పద రెట్రోస్పెక్టివ్ టాక్స్ (వెనుకటి తేదీ నుంచి పన్ను) చట్టం రద్దు చేసే విషయమై కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది. ఈ చట్టం అమలుకు వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి దిగిన కెయిర్న్ ఎనర్జీ, వొడాఫోన్ వంటి సంస్థలు విదేశీ న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన కేసులను ఉపసంహరించుకోవాలని సూచించింది. భవిష్యత్లో ప్రభుత్వానికి ఎటువంటి నష్టం చేయబోమని హామీ ఇవ్వాలని తెలిపింది. అందుకోసం ఇండెమ్నిటీ బాండ్ సమర్పించాలని పేర్కొన్నది.
ఈ నిబంధనలకు కట్టుబడితేనే 2012 రెట్రోస్పెక్టివ్ చట్టం ప్రకారం వసూలు చేసిన పన్నుల రద్దు ప్రక్రియ మొదలవుతుందని కేంద్రం తేల్చి చెప్పింది. ఆ చట్టం ప్రకారం వసూలు చేసిన పన్ను మొత్తం తిరిగి చెల్లిస్తామని వివరించింది. అలా చెల్లింపులు పూర్తి చేయడానికి రెండు, మూడు నెలలు పడుతుందని తెలిపింది.
వివిధ కోర్టులు, ఫోరంలలో ఉన్న కేసులను వెనుకకు తీసుకుంటామని పేర్కొంటూ కెయిర్న్ ఎనర్జీ, వొడాఫోన్ 45 రోజుల్లో అండర్టేకింగ్స్ సమర్పించాలని వివరించింది. ఈ అండర్టేకింగ్ అందిన 15 రోజుల్లో ఆదాయం పన్ను విభాగం కార్యదర్శి సదరు పన్ను క్లెయిమ్లు రద్దు చేసినట్లు సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపింది.
అటుపై రెండు నెలల్లో ఆయా కంపెనీలు ఇండెమ్నిటీ బాండ్తోపాటు ఇతర నిబంధనలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలు పూర్తి చేయాలన్నది. ఆ తర్వాత నెల రోజులకు ఆయా సంస్థలకు రెట్రోస్పెక్టివ్ చట్టం నుంచి రిలీఫ్ కలిగిస్తున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేస్తారని, తర్వాత పది రోజులకు ఆయా సంస్థలకు చెల్లింపులు మొదలవుతాయని వివరించింది