న్యూఢిల్లీ, డిసెంబర్ 13: వొడాఫోన్ ఐడియాను టేకోవర్ చేసే ఎటువంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రం స్పష్టంచేసింది. వొడాఫోన్ ఐడియాను టేకోవర్ చేసే ప్రణాళిక ప్రభుత్వానికి ఉందా అన్న ప్రశ్నకు బుధవారం లోక్సభలో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ తమ శాఖ వద్ద ఎటువంటి ప్రతిపాదన లేదని తెలిపారు.
33 శాతం వాటా ప్రభుత్వానిదే
ప్రస్తుతం వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి 33.1 శాతం వాటా ఉంది. ఆ కంపెనీ టెలికం శాఖకు చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈక్విటీ షేర్లుగా మార్చుకున్నది. దీంతో ప్రభుత్వానికి ఆ వాటా సమకూరింది. ఇప్పుడు కంపెనీలో అతిపెద్ద వాటాదారు కేంద్ర ప్రభుత్వమే. భాగస్వామ్య సంస్థ బ్రిటన్కు చెందిన వొడాఫోన్కు 32.3 శాతం, ఆదిత్యా బిర్లా గ్రూప్నకు 18.1 శాతం..రెండింటికీ కలిపి 50.4 శాతం వాటా ఉన్నది. మిగిలిన వాటా పబ్లిక్ది. వొడాఫోన్ చెల్లించాల్సిన మరో రూ.40,000 కోట్లకు నాలుగేళ్లపాటు మారటోరియం ఉన్నది. అయితే ఈ మొత్తాన్ని 2026 నుంచి కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ బకాయిల్ని ఈక్విటీగా మార్చుకుని వాటాను 70 శాతానికి పెంచుకుంటుందన్న అంచనాలున్నాయి.