LTCG Tax | దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను (LTCG) పన్ను వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాకు రూ.98,681 కోట్ల ఆదాయం లభించింది. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం రాజ్యసభలో ఈ సంగతి ప్రకటించారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం వరకూ ఎల్టీసీజీ టాక్స్ ద్వారా వచ్చిన ఆదాయం వివరాలను సభ్యులకు వెల్లడించారు.
ఈక్విటీ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను విధానాన్ని 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. రూ.లక్ష వరకూ ఆదాయంపై పన్ను రాయితీ, మిగతా పెట్టుబడులపై 10 శాతం ఎల్టీసీజీ పన్ను విధిస్తారు. 2021-22లో రూ.86,075.49 కోట్ల ఎల్టీసీజీ పన్ను వసూలైందని పంకజ్ చౌదరి చెప్పారు. 2022-23లో 15 శాతం పుంజుకుని రూ.98,681.34 కోట్ల ఎల్టీసీజీ పన్ను వసూలైందన్నారు. 2018-19లో రూ.29,220 కోట్లు, 2019-20లో రూ.26,008 కోట్లు, 2020-21లో రూ.38,589 కోట్ల ఎల్టీసీజీ పన్ను వసూలైందని పంకజ్ చౌదరి వెల్లడించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఈక్విటీలు లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులపై ఎల్టీసీజీ పన్ను విధానాన్ని ఎప్పటి నుంచి రద్దు చేస్తారన్న సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన పంకజ్ చౌదరి.. అటువంటి ప్రతిపాదనేదీ లేదని చెప్పారు. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులపై ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 10 నుంచి 12.5 శాతం వరకూ ఈక్విటీలు, ఈక్విటీల ఆధారిత ఎల్టీసీజీ పన్ను పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో తెలిపారు. అలాగే రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకూ ఎల్టీసీజీ పన్ను మినహాయింపు పరిమితి పెంచినట్లు తెలిపారు. దీర్ఘకాలిక పెట్టుబడి లాభాల (ఎల్టీసీజీ) కిందకు 12 నెలలకు పైగా గడువుతో మదుపు చేసిన పెట్టుబడులను దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలు (ఎల్టీసీజీ) అంటారు.