LIC IPO | ఇన్వెస్టర్లు, కేంద్ర ప్రభుత్వం, సామాన్యులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐపీవో జాప్యమయ్యే అవకాశం ఉంది. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఎల్ఐసీ ఎప్పుడు ఐపీవోకు వెళ్లాలన్న విషయమై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ ఆంగ్లదినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వాస్తవంగా జాతీయ పరిస్థితులను బట్టే ఎల్ఐసీ ఐపీవో టైం ఖరారు చేశాం, కానీ అంతర్జాతీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే మరోసారి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.
ఉక్రెయిన్-రష్యా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఎల్ఐసీ ఐపీవోపై కేంద్రం సమీక్ష జరిపితే.. జాప్యం కావచ్చు. రూ.5.4 లక్షల కోట్ల విలువైన ఎల్ఐసీలో ఐపీవో ద్వారా 10.4 బిలియన్ డాలర్ల విలువైన వాటాల విక్రయానికి కేంద్రం సిద్ధమైంది. బడ్జెట్లో ద్రవ్యలోటు సమస్య పరిష్కారానికి ఎల్ఐసీ ఐపీవో కీలకం కానున్నది. గత నెల 13న ఐపీవోకు అనుమతించాలని సెబీకి ఎల్ఐసీ దరఖాస్తు చేసింది. ఎల్ఐసీ ఐపీవో జాప్యం అయితే, ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను చేరుకోలేరు కదా? అన్న ప్రశ్నపై నిర్మలా సీతారామన్ స్పందిస్తూ తాను యావత్ ప్రపంచానికి వివరించాల్సి ఉంటుందన్నారు.