LIC IPO | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఈ నెలాఖరులోపు స్టాక్ మార్కెట్లను తాకనున్నది. వచ్చేవారం లేదా.. నెలాఖరులో ఆఫర్ మొదలవుతుందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సారధ్యంలోని మంత్రుల బృందం అధికారులు చెప్పారు. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ ఉన్నారు. త్వరలో ఈ కమిటీ ఎల్ఐసీ ఐపీవోకు వెళ్లేందుకు అనుమతి ఇస్తుందని తెలిపారు. ఇంతకుముందు సెబీకి సమర్పించిన పత్రాల ప్రకారం వచ్చేనెల 12 లోపు ఎల్ఐసీ ఐపీవోకు వెళ్లేందుకు అవకాశం ఉంది. అందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటున్నది.
ఇంతకుముందే ఐపీవోకు వెళ్లాలని నిర్ణయించినా.. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం దరిమిలా మార్కెట్లో అనిశ్చితి వల్ల వాయిదా పడింది. దీపం అధికారుల అంచనా ప్రకారం ఐపీవోను ప్రకటించడానికి అవసరమైన పత్రాలను సెబీకి సమర్పించడానికి ప్రభుత్వానికి 10 రోజుల సమయం అవసరం అని తెలుస్తున్నది. తొలుత 316 మిలియన్ల షేర్లను ఐపీవో ద్వారా విక్రయించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ విక్రయ వాటా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్హెచ్పీ) దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొనేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు యాంకర్ ఇన్వెస్టర్లకు మూడు, నాలుగు రోజుల సమయం అవసరం అని వార్తలొచ్చాయి. ఐపీవోలో పాల్గొనేందుకు ఆసక్తి గల యాంకర్ ఇన్వెస్టర్ల అభిప్రాయాలను తెలుసుకోవాలని మర్చంట్ బ్యాంకర్లను దీపం అధికారులు కోరారు.
ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ నెలలోనే ఎల్ఐసీ ఐపీవోకు వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలో ఐపీవోకు వెళ్లేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సమాచారం.