Food Subsidy Slash | కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ బిల్లు తగ్గించుకునే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఏయేటికాయేడు ఫుడ్, ఫర్టిలైజర్స్ సబ్సిడీలో కోత విధిస్తూ ముందుకు సాగుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేకించి ఫుడ్ అండ్ ఫర్టిలైజర్ సబ్సిడీలు రూ.2.60 లక్షల కోట్లు, రూ.90 కోట్లకు పరిమితం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల కంటే తక్కువ. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం అన్ని రకాల సబ్సిడీ పద్దు సుమారు రూ.5.35-5.45 లక్షల కోట్లు. కానీ వచ్చే ఏడాది దీన్ని కుదించాలని కేంద్ర ఆర్థికశాఖ కోరుకుంటున్నట్లు వినికిడి.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 6.5 శాతంగా నిర్దేశించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతం ద్రవ్యలోటు ఉంటుందని అంచనా. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్కు సమర్పిస్తారు. ద్రవ్య లక్ష్యాలకు అనుగుణంగా ఫుడ్, ఫర్టిలైజర్స్పై సబ్సిడీలను సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల కథనం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫుడ్ సబ్సిడీ బిల్లు రూ.3.90 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జరిగిన కేటాయింపులు రూ.4.22 లక్షల కోట్ల కంటే తక్కువ. బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం రూ.2.43 లక్షల కోట్ల కంటే ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చే మార్చి వరకు ప్రధాన్మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద మార్చి వరకు ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ చేస్తున్నది. ఫలితంగా బడ్జెట్లో ప్రతిపాదించిన దానికంటే ఫుడ్ సబ్సిడీ పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎంజీకేఏవై రూ.1.47 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫర్టిలైజర్స్ సబ్సిడీ కింద రూ.79,530 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. ఫర్టిలైజర్స్ అధిక ధరలు, సరఫరాలో అంతరాయం కారణంగా ఫర్టిలైజర్స్ బిల్లు రెట్టింపై రూ.1.41 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఫుడ్ సబ్సిడీ కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తున్నది.