న్యూఢిల్లీ, డిసెంబర్ 3: సెమీకండక్టర్ డిజైన్ ప్రాముఖ్యతను గుర్తించామని, అందుకే చిప్ డిజైన్ సంబంధిత కార్యకలాపాల కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను బడ్జెట్లో రూ.100 కోట్లను కేటాయించామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో ఈ మేరకు వచ్చిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సెమీకండక్టర్ డిజైన్ అనేది ఎంతో పరిజ్ఞానంతో కూడుకున్నదని, దీనికి అత్యంత నైపుణ్యం కలిగిన మానవ, మౌలిక వనరులు అవసరమన్నారు. నిజానికి దేశంలో చిప్ డిజైన్ను చేసే ప్రతిభావంతులకు కొదవే లేదని.. ఎక్కువ సంఖ్యలో డిజైన్ పేటెంట్లు, మేధో సంపత్తి హక్కులు భారతీయ డిజైన్ ఇంజినీర్లకే ఉన్నాయని గుర్తుచేశారు. చిప్ కొరత దృష్ట్యా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్కు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని వివరించారు. సెమీకండక్టర్ల అభివృద్ధి కోసం ఇప్పటికే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గల్లియం నైట్రేడ్ ఎకోసిస్టమ్ సెంటర్కు ఆమోదం కూడా తెలిపినట్లు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్, మొహాలీ, బెంగళూరుల్లో వ్యూహాత్మక అవసరాల కోసం సెమీకండక్టర్ వేఫర్ ఫ్యాబ్రికేషన్ కేంద్రాలున్నాయని తెలిపారు.