హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో పనిచేసినప్పుడే గనుల రంగంలో స్వావలంబన లక్ష్యం సాధ్యమని కేంద్ర గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. హైదరాబాద్లో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే గనుల శాఖ మంత్రుల సదస్సును మంత్రి ప్రహ్లాద్ జోషి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఖనిజ రంగాన్ని ఆత్మనిర్భర్గా మార్చడంతో పాటు సుస్థిరమైన గనుల రంగ అభివృద్దిని ప్రోత్సహించడానికి ఈ సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించిన పలు అంశాలు..
హైదరాబాద్ చారిత్రాత్మక నగరం
హైదరాబాద్ నగరంపై మంత్రి ప్రశంసల జల్లు కురిపించారు. ఈ నగరం చారిత్రాత్మక నగరమని, ఇక్కడ స్వామి రామనందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు లాంటి వారు స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో గుర్తింపుపొందారన్నారు. ముత్యాల నగరంగా భాగ్యనగరం గుర్తింపు పొందిందని అన్నారు. జైహింద్ నినాదం కూడా హైదరాబాద్కు చెందిన అబిద్ హసన్ సఫ్రాని ఇచ్చారని అన్నారు.