IDBI Bank Privatisation | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాను విక్రయించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నదని సమాచారం. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కలిసి సుమారు (కేంద్ర ప్రభుత్వానికి 45.48%, ఎల్ఐసీకి 49.24 శాతం) 94 శాతం వాటా కలిగి ఉన్నాయి. అయితే, మొత్తం వాటాలో ఎంత మొత్తం విక్రయించాలన్న విషయమై చర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఎంత వాటా విక్రయించాలన్న విషయమై కేంద్ర మంత్రుల బృందం తుది నిర్ణయం తీసుకోనున్నదని పేరు చెప్పడానికి ఇష్ట పడని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. వచ్చేనెలాఖరు నాటికి ఇటు ప్రభుత్వం, అటు ఎల్ఐసీ తుది నిర్ణయానికి రానున్నాయి. గత 12 నెలలుగా ఐడీబీఐ షేర్ 6.3 శాతం పెరగడంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.42,470 (530 కోట్ల డాలర్లు) కోట్లుగా ఉంది.
వాటాల ఉపసంహరణపై ఐడీబీఐ బ్యాంకు అధికారులు గానీ, కేంద్ర ఆర్థికశాఖ అధికారులు గానీ, ఎల్ఐసీ ప్రతినిధులు గానీ స్పందించడానికి అందుబాటులోకి రాలేదు. ఐడీబీఐ బ్యాంకులో కేంద్రం, ఎల్ఐసీ వాటాల ఉపసంహరణతోపాటు యాజమాన్య హక్కులు కూడా వదులుకోనున్టన్లు సమాచారం. బ్లూంబర్గ్ న్యూస్ కథనం ప్రకారం ఐడీబీఐ బ్యాంకులో ఇన్వెస్టర్లు 40 శాతానికి పైగా కొనుగోలు చేసేందుకు ఆర్బీఐ అనుమతించొచ్చు.
అయితే, నాన్ రెగ్యులేటెడ్ సంస్థలు 10 నుంచి 15 శాతం లోపు వాటాలు కొనుగోలు చేసేందుకు మాత్రమే అనుమతి ఉంది. అటువంటి సంస్థలు ఎక్కువ వాటాలు కొనుగోలు చేయాలంటే ఆర్బీఐ అనుమతి పొందడం తప్పనిసరి. ఐడీబీఐలో వాటాలను ఉపసంహరించడానికి నిబంధనలు సవరిస్తూ తీసుకున్న నిర్ణయానికి గత మే నెలలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.