E-Vehicle Policy | దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించడానికి కేంద్రం ఎలక్ట్రిక్ వెహికల్ విధానానికి ఆమోదం తెలిపింది. ఏదైనా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ కనీసం రూ. 4,150 కోట్ల (500 మిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెడితే రాయితీలు వర్తిస్తాయి. దీంతో అమెరికా కేంద్రంగా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్న టెస్లా వంటి కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈవీ పాలసీని తయారు చేసినట్లు తెలిపింది.
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసిన కంపెనీలను పరిమిత సంఖ్యలో తక్కువ కస్టమ్స్ సుంకంపై దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇస్తారు. దీనివల్ల కొత్త టెక్నాలజీ భారతీయులకు అందుబాటులోకి రావడంతోపాటు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతం ఇచ్చినట్లవుతుందని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. తత్ఫలితంగా పర్యావరణ పరిరక్షణకు మేలు జరుగుతుందని, ముడి చమురు దిగుమతులు తగ్గి, వాణిజ్య లోటు తగ్గుతుందని వెల్లడించింది.