న్యూఢిల్లీ, ఆగస్టు 17: మొబైల్ ఫోన్లతోపాటు అన్ని పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైజ్లకు ఒకే రకం చార్జర్లపై కేంద్ర ప్రభుత్వం నిపుణుల బృందాలను ఏర్పాటు చేయబోతున్నది. ఈ బృందాలు రెండు నెలల్లో సవివరంగా నివేదికను సమర్పిస్తాయని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ బుధవారం తెలిపారు. ఈ అంశంపై ఇక్కడ భారతీయ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సెస్ తయారీదారుల సంఘం, భారతీయ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారుల సంఘం, ఐటీ తయారీదారుల సంఘం, ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ ఇన్నోవేషన్ కన్సార్టియం ఫౌండేషన్ల అధ్యక్షులు, చైర్మన్లతోపాటు ఫిక్కీ, సీఐఐ, అసోచామ్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బీహెచ్యూల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ‘ఇదో సంక్లిష్టమైన సమస్య. చార్జర్ల తయారీలో భారత్ కూడా ఉన్నది.
కాబట్టి తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు పరిశ్రమ, వినియోగదారులు, తయారీదారుల అభిప్రాయాలు, అవసరాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది’ అని ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ సింగ్ అన్నారు. ఈ క్రమంలోనే స్మార్ట్-ఫీచర్ ఫోన్లు, ల్యాప్టాప్లు-ఐపాడ్లు, వాచీలు తదితర ధరించే ఎలక్ట్రానిక్ డివైజ్ల కోసం ప్రస్తుతం వినియోగిస్తున్న చార్జర్లపై అధ్యయనానికి వేర్వేరుగా నిపుణులతో బృందాలను ఈ నెలలోనే ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. కాగా, సీ-రకం పోర్ట్సహా మొత్తం రెండు రకాల చార్జర్లనే అందుబాటులో ఉంచాలన్న యోచన ప్రభుత్వం నుంచి కనిపిస్తున్నది. ప్రస్తుతం ఆయా బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర వియరబుల్ డివైజ్లకు రకరకాల చార్జర్లను వినియోగదారులు వాడుతున్న విషయం తెలిసిందే.