Digital Fraud | ఇప్పుడు చెల్లింపులన్నీ డిజిటల్ పేమెంట్సే.. అదే స్థాయిలో డిజిటల్ మోసాలు జరుగుతున్నాయి. వాటి కట్టడికి కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే అనుమానాస్పదంగా జరుగుతున్న లావాదేవీలతో 70 లక్షల మొబైల్ ఫోన్ నంబర్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం తెలిపింది.
ఈ విషయమై బ్యాంకుల ప్రతినిధులతో కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి మాట్లాడుతూ.. డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు బ్యాంకులు తమ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలన్నారు. ఆధార్ ఆధారిత పేమెంట్స్లో మోసాలు, సమాచార సెక్యూరిటీపై ఫోకస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేశారు.
ఈ సమావేశంలో కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని రెవెన్యూ విభాగం, టెలికం శాఖ, టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిజిటల్ మోసాలను అరికట్టేందుకు తలెత్తుతున్న సవాళ్లపై ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.