Maruti on 6 Air Bags | రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్స్ తప్పనిసరి ఏర్పాటు చేయాలన్న నిబంధనను కేంద్రం తీసుకొచ్చింది. అయితే, ఆటోమొబైల్ సంస్థల అభ్యర్థన మేరకు అన్ని కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్లు తప్పనిసరి నిబంధనను 2023 అక్టోబర్ ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రకటించారు. దీనిపై దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ రియాక్టయ్యారు. అన్ని కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్లు తప్పనిసరి చేయాలన్ననిబంధన అమలుపై ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆందోళన సబబేనని ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. తొలుత 2022 అక్టోబర్ ఒకటో తేదీ (శనివారం) నుంచే అన్ని కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్లు తప్పనిసరిగా అమర్చాల్సిందేనని కేంద్రం నోటిపికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
`మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్న వేళ, అన్ని కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్లు అమర్చాలన్న నిర్ణయం అమలు చేయడానికి సమయం సరిపోదని కేంద్ర ప్రభుత్వానికి ఆటో ఇండస్ట్రీ తెలిపింది. గడువు వాయిదా వేయాలన్న మా అభ్యర్థనకు ప్రభుత్వం విలువనిచ్చింది. ఇండస్ట్రీకి ప్రభుత్వం మద్దతుగా నిలిచింది` అని ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. `కొన్ని కార్ల తయారీ సంస్థలకు 2023 అక్టోబర్ ఒకటో తేదీ గడువు సరిపోతుంది. కానీ ఆరు ఎయిర్బ్యాగ్లు అమర్చే విషయమై సంస్థాగత మార్పులు చేయాల్సిన కొన్ని కార్ల తయారీ సంస్థలకు సరిపోదు` అని చెప్పారు. `కొన్ని కార్లలో ఎయిర్బ్యాగ్లు అమర్చేందుకు వీలుగా కార్ల బాడీలో మార్పులు చేయడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని కార్లను టైం ఫ్రేమ్లోపే అమర్చవచ్చు` అని అన్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, సురక్షిత ప్రయాణం కోసం కార్లలో ఆరు ఎయిర్బ్యాగ్లు తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డేటా ప్రకారం 2021లో రోడ్డు ప్రమాదాల వల్ల 1.55 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సగటున గంటకు 18 మంది (రోజూ 426 మంది) అశువులు బాసారు. ఇది అత్యధిక మరణాల రేటు అని ఎన్సీఆర్బీ రికార్డులు చెబుతున్నాయి.