LIC to Private | బీమా సౌకర్యంతో ఇండియన్ల భవితవ్యానికి బాటలు వేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రైవేట్ పరం కానున్నదా.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)లకు కేంద్రం అనుమతి ఇస్తుందా? అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలోకి ఎఫ్డీఐలను అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నదని వార్తలు వచ్చాయి. త్వరలో ఐపీవోకు వెళ్లనున్న ఎల్ఐసీలో భారీ మొత్తంలో వాటాలను కొనుగోలు చేసేందుకు సింగిల్ ఓవర్సీస్ ఇన్వెస్టర్ను అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
బీమా సంస్థల్లో ఏదేనీ వ్యూహాత్మక పెట్టుబడులు.. ప్రత్యేకించి ఎఫ్డీఐలకు పరిమితులు ఉన్నాయి. ఇది ఇంకా పూర్తిస్థాయిలో అంగీకారానికి రాలేదని, ఓ అధికారి చెప్పారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 20 శాతం వరకు ఎఫ్డీఐలను అనుమతించొచ్చునని చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
దేశ ఆర్థిక రంగ చరిత్రలోనే ఎల్ఐసీ ఐపీవో అతి పెద్దది కానున్నదని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఎల్ఐసీలోకి ఎఫ్డీఐలను అనుమతినిస్తే వ్యూహత్మక ఇన్వెస్టర్ల పేరిట పెన్షన్ ఫండ్ సంస్థలు, బీమా సంస్థలు వాటాలు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తి గానీ, విదేశీ సంస్థ గానీ 10 శాతం లేదా పెద్ద మొత్తంలో వాటాలను ఎఫ్డీఐ రూపంలో కొనుగోలు చేసే సంస్థలను ఎఫ్డీఐగా ఆర్బీఐ నిర్వచించింది. మరోవైపు, ఎల్ఐసీ ఐపీవోలో తమకు అవకాశం కల్పించాలని గురువారం కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్లు ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నాయి.
దేశంలోని బీమా సంస్థల్లోకి 74 శాతం ఎఫ్డీఐలను అనుమతించినా.. ఎల్ఐసీకి ఈ నిబంధన వర్తించదని సమాచారం. ఇందుకోసం పార్లమెంట్లో చట్టం తీసుకు రావాల్సి ఉంటుంది. దీనిపై చర్చలు ప్రాధమిక స్థాయిలో ఉన్నాయని వినికిడి. దీనిపై కేంద్ర ఆర్థికశాఖ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు.