Google : డాక్టర్ల ప్రిస్కిప్షన్లోని అక్షరాలు గీతల మాదిరి గజిబిజిగా ఉంటాయి. ఆ మందుల చీటీలోని అక్షరాలు మెడికల్ షాపువాళ్లకు తప్ప మిగతావాళ్లకు ఒక పట్టాన అర్థం కావు. రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి మారనుంది. వైద్యులు రాసిచ్చిన ప్రిస్కిప్షన్ను డీకోడ్ చేసే టెక్నాలజీని గూగుల్ త్వరలోనే తీసుకురానుంది. డాక్టర్ల చేతిరాతను డిజిటలైజ్ చేయడంలో ఉపయోగపడే ఆర్టిఫీషియల్ టెక్నాలజీపై తాము పనిచేస్తున్నామని గూగుల్ తెలిపింది. ఈ విషయాన్ని గూగుల్ ఫర్ ఇండియా 2022 కార్యక్రమంలో గూగుల్ రీసెర్చ్ డైరెక్టర్ మనీష్ గుప్తా వెల్లడించారు.
‘డాక్టర్లు ప్రిస్కిప్షన్ను చేత్తో రాస్తారనే విషయం మనందరికి తెలుసు. ఆ చీటీని చదవడం, గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ను తీసుకొచ్చామంటే.. అది గూగుల్ లెన్స్ ద్వారా డాక్టర్లు రాసిచ్చిన చీటీలోని మందులను గుర్తిస్తుంది’ అని మనీష్ గుప్తా తెలిపారు. ఢిల్లీలో గూగుల్ ఫర్ ఇండియా 2022 ఈవెంట్ జరుగుతోంది. మనదేశంలో 8వ సారి జరుగుతున్న ఈ ఈవెంట్లో గూగుల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే సర్వీసులు, యాప్లనే ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది.
ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రాష్ట్రపతిభవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. భారతదేశంలో డిజిటల్ లిటరసీ కోసం గూగుల్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ముర్ముకు వివరించారు.