న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం, ప్రముఖ సెర్చ్ఇంజిన్ గూగుల్లో ఉద్యోగుల తొలగింపు (Google Layoff) కొనసాగుతున్నది. కాస్ట్ కటింగ్ పేరుతో పైథాన్ టీమ్ మొత్తాన్ని ఎత్తేసిన గూగుల్ తాజాగా సుమారు 200 మందిపై వేటువేసింది. వీరంతా కోర్ టీమ్లో సభ్యులని, గత నెల 25కు ముందే వీరందరిని తొలగించినట్లు ఓ నివేదిక పేర్కొంది. వీరిలో కాలిఫోర్నియా, సన్నీవేల్లోని ఆఫీసుల్లోని ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపింది. అమెరికా వెలుపల చౌకగా ఉద్యోగులు లభిస్తుండటంతో ఈ పోజిషన్లను భారత్, మెక్సికోకు బదిలీ చేయనున్నట్లు సమాచారం.
ఇప్పటికే పైథాన్, ఫ్లుట్టర్, డార్ట్లపై పనిచేసే బృందాల్లోని చాలా మంది ఉద్యోగులను గూగుల్ కంపెనీ తొలగించింది. వారికి కంపెనీలోనే ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించామని గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
కాగా, ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు టెక్ రంగంలో ఉద్యోగాల కోల్పోయిన వారి సంఖ్య 70 వేలు దాటింది. ఉద్యోగులను తీసేసిన సంస్థల జాబితాలో టెక్ దిగ్గజాలైన గూగుల్తోపాటు అమెజాన్, యాపిల్, ఇంటెల్, టెస్లా వంటి సంస్థలు ఉన్నాయి. ఎలాన్ మస్క్కు చెందిన కార్ల తయారీ సంస్థ టెస్లా పలు విభాగాల్లోని వేలాది మంది ఉద్యోగులపై వేటు వేసింది. అమ్మకాలు తగ్గిన నేపథ్యంలో ఖర్చులను అదుపులో ఉంచుకోనేందుకు ప్రపంచవ్యాప్తంగా 10 శాతం ఉద్యోగులను తొలగించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ చర్య చేపట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
యాపిల్లో స్పెషల్ ప్రాజెక్టు గ్రూపులోని 614 మంది ఫైర్ అయ్యారు. వీరిలో కొంత మంది ప్రస్తుతం రద్దయిన సెల్ఫ్-డ్రైవింగ్ కారు ప్రాజెక్టుకు చెందిన వారు. క్లౌడ్ కంప్యూటింగ్ డివిజన్లో అమెజాన్ వందలాది మందిని తొలగించింది. ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ దాదాపు 500 మందిపై వేటు వేసింది. ఇంకా ఇంటెల్, ఓలా క్యాబ్స్, హెల్తిఫై, టెలినార్ వంటి సంస్థలు గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు తొలగింపు చేపట్టాయి.