Sundar Pichai | రెండేండ్లుగా మానవాళిని వణికించిన కొవిడ్ మహమ్మారి ప్రభావం చూపిన టైంలో దిగ్గజ టెక్ సంస్థలు అద్భుతమైన పనితీరు ప్రదర్శించడమే కాదు.. భారీగా లాభాలు కూడా గడించాయి. అందుకనుగుణంగా ఆయా సంస్థల సీఈవోలు, ఇతర కీలక ఎగ్జిక్యూటివ్లకు సదరు కంపెనీ మేనేజ్మెంట్లు అనూహ్యంగా బోనస్ పెంచేశాయి. కానీ సెర్చింజన్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్కు చెల్లించే బోనస్లో 14 శాతం కోత విధించిందని ఫైన్బోల్డ్ అనే సంస్థ తెలిపింది. వివిధ సంస్థల సీఈవోలకు లభించిన బోనస్ల గురించి తెలుసుకుందామా..
అమెరికాలోని ప్రముఖ సెమీ కండక్టర్ల తయారీ సంస్థ బ్రాడ్కామ్ సీఈవో తాన్హాక్ ఎంగ్ అత్యధికంగా 1586 శాతం బోనస్ పొందాడు. అంటే 3.6 మిలియన్ డాలర్ల నుంచి 60.7 మిలియన్ డాలర్లు పొందారు. తర్వాతీ జాబితాలో ఒరాకిల్ సీఈవో సాఫ్రా అడా క్యాట్జ్, ఇంటెల్ సీఈవో పాటా గ్లెసింగేర్, ఆపిల్ సీఈవో టిమ్కుక్, అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ ఉన్నారు. ఒరాకిల్ సీఈవో సాఫ్రా అడా క్యాట్జ్ 999 శాతం బోనస్ అందుకున్నారు.
ఇక ఇంటెల్ సీఈవో గ్లెసింగేర్ 713.64 శాతం అదనంగా బోనస్ అందుకున్నారు. సాధారణంగా 22 మిలియన్ డాలర్ల బోనస్కు బదులు 179 మిలియన్ డాలర్లు పొందారు. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ 35.8 మిలియన్ల నుంచి 571.63 శాతంతో 211.9 మిలియన్ల డాలర్ల బోనస్ తీసుకున్నారు.
కానీ సుందర్ పిచ్చాయ్కు గూగుల్ 14 శాతం బోనస్ తగ్గించి షాక్ ఇచ్చింది. అయితే, ఆయనకు స్టాక్ ప్యాకేజీ పేరిట భారీగా లబ్ధి చేకూరింది. 2020 నుంచి సుందర్ పిచాయ్ వార్షిక వేతనం రూ.14కోట్లు. అదనంగా 2020, 2021లలో స్టాక్ ప్యాకేజీ కింద ఆయనకు గూగుల్ రూ.1707 కోట్లు అందించింది.