న్యూయార్క్ : కార్యాలయాల నుంచి పనిచేసేందుకు గూగుల్ మ్యాప్స్ కాంట్రాక్టు ఉద్యోగులు విముఖత వ్యక్తం చేశారు. ప్రయాణ ఖర్చులు తాము భరించలేమని దాదాపు 200 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఈ దిశగా పిటిషన్పై సంతకాలు చేశారు. ఉద్యోగ విధానాల విషయంలో తమకూ గూగుల్ ఉద్యోగుల మధ్య అంతరాలపైనా కాంట్రాక్టు ఉద్యోగులు భగ్గుమంటున్నారు. వర్క్ ఫ్రం ఆఫీస్ తమకు సాధ్యం కాదని, పెరిగిన ఇంధన ధరలతో పాటు ద్రవ్యోల్బణం, కొవిడ్-19 సోకే ముప్పు వంటి పలు కారణాలతో తాము ఇంటి నుంచే పనిచేస్తామని వారు తేల్చిచెబుతున్నారు.
ఈ పిటిషన్పై సంతకాలు చేసిన 200 మందిలో 60 శాతం మంది గూగుల్ కోసం ఔట్సోర్సింగ్పై కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నుంచి పనిచేస్తున్న వారు ఉన్నారు. గూగుల్ తాజాగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జూన్ 6 నుంచి వారానికి అయిదు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాలని కోరింది. రిటన్ టూ ఆఫీస్ టైమ్లైన్ను రద్దు చేసి ముందుగా ఉద్యోగుల ఆర్ధిక, ఆరోగ్య పరిస్ధితి, ఛైల్డ్ కేర్పై దృష్టి సారించాలని గూగుల్తో పనిచేస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులు కోరుతున్నారు.
ఈ పిటిషన్ను 900 మంది సభ్యులతో కూడిన ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ సమర్ధించింది. అల్ఫాబెట్ గూగుల్ మాతృసంస్ధ కావడం గమనార్హం. మరోవైపు ఉద్యోగులు చేస్తున్న పని, క్లైంట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమ రిటన్ టూ ఆఫీస్ పాలసీ ఆధారపడి ఉంటుందని కాగ్నిజెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. తమ ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది.