వడ్డించేవాడు మనవాడైతే వరుసలో ఏ మూలన కూర్చున్నా విందు భోజనమే.
సరిగ్గా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీరు కూడా ఇలాగే ఉంటున్నది. స్వరాష్ట్రం గుజరాత్పై మరోమారు తనకున్న అభిమానాన్ని కాదుకాదు.. అక్కెరను కనబర్చారు.
గుజరాత్లోని గిఫ్ట్ సిటీకి చెందిన ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్లకు మూలధన లాభాల పన్ను నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపును కల్పించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
PM Modi | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ (గిఫ్ట్) సిటీకి నరేంద్ర మోదీ సర్కారు నుంచి మరో నజరానా దక్కింది. ఇప్పటికే స్వరాష్ట్రంలో ఏర్పాటైన దీని ప్రాధాన్యతను పెంచేందుకు రకరకాలుగా ప్రోత్సాహకాలిచ్చిన ప్రధాన మంత్రి మోదీ.. ఇప్పుడు ఇక్కడి ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ యూనిట్లు, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) యూనిట్లలో దేనికైనా మూలధన లాభాల పన్ను (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) నుంచి మినహాయింపునిచ్చారు. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నుంచి తాజాగా ఓ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఫండ్ మేనేజ్మెంట్) రెగ్యులేషన్స్ 2022 కింద ప్రారంభమైన ఈటీఎఫ్ యూనిట్, ఓ పథకంలో భాగంగా మొదలైన యూనిట్, ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ యూనిట్లు మూలధన లాభాల పన్నును చెల్లించాల్సిన అవసరం లేదని సీబీడీటి సదరు ప్రకటనలో స్పష్టం చేసింది.
ట్యాక్స్ న్యూట్రల్ ఎంక్లేవ్
గిఫ్ట్ సిటీ-ఐఎఫ్ఎస్సీని దేశ ఆర్థిక రంగానికే ఓ ట్యాక్స్ న్యూట్రల్ ఎంక్లేవ్గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గిఫ్ట్ సిటీలో ఏర్పాటైన కంపెనీలు జారీచేసే సెక్యూరిటీలకుగానీ లేదా స్టాక్ ఎక్సేంజ్లపై ట్రేడ్ అయ్యే సెక్యూరిటీలకుగానీ మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. గిఫ్ట్ సిటీకి భారత్లో ప్రాధాన్యాన్ని పెంచగలదని చెప్తున్నారు. గిఫ్ట్ సిటీ అనేది దేశంలోని ఏకైక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ). ఇదో స్పెషల్ ఎకనామిక్ జోన్. 2007లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటైంది. అయినప్పటికీ మోదీ ప్రధాన మంత్రి అయ్యాకే గిఫ్ట్ సిటీ ఆకర్షణీయంగా మారింది. ఇందుకు కారణం ఇక్కడి వ్యాపార సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, ట్యాక్స్ హాలిడేలున్నాయి.
మొదట్నుంచీ ఇంతేనా..
నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయిన దగ్గర్నుంచీ గుజరాత్కు అగ్ర తాంబూలం ఇస్తూనే ఉన్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇతర రాష్ర్టాల్లో నైపుణ్యం, ప్రతిభగల మానవ వనరులకు కొదవే లేకున్నా.. ఎక్కడా మరో ఐఎఫ్ఎస్సీ లేనేలేదు. గుజరాత్లో మాత్రమే ఉన్నది. అలాగే మోదీ హయాంలోనే దేశీయ అతిపెద్ద స్టేడియం గుజరాత్లో ఏర్పాటైంది. సర్దార్ పటేల్ స్టేడియంను నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్చి నిర్మించారు. దీని సీటింగ్ సామర్థ్యం 1.3 లక్షలు. 2036 ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు ఇక్కడే జరుగుతాయంటున్నారు. ఇక గుజరాత్కు చెందిన గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం ఎదుగుదలలో మోదీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోదీ హయాంలోనే అదానీ గ్రూప్ అన్ని రంగాల్లోకి విస్తరించినది తెలిసిందే. ఇలా చెప్పుకుంటూపోతే కేంద్రం నుంచి రాష్ర్టాలకు దక్కే అన్ని రకాల ప్రాజెక్టులు, నిధులు, ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు ఇలా అన్నింటా గుజరాత్కే పెద్దపీట. చివరకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, దానికి ఎన్నుకున్న నాయకుడి విషయంలోనూ గుజరాతీ పక్షపాత ధోరణి ప్రధాని మోదీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇకపోతే మోదీ తరచూ చేస్తున్న విదేశీ పర్యటనల్లో కుదిరే ఒప్పందాల్లోనూ ఎక్కువ గుజరాత్కు సంబంధించినవే. కొంతకాలం కిందట ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ విషయమై ప్రధాని మోదీపై కురిపించిన ప్రశంసలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.