బెంగళూరు, జనవరి 13: ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా.. పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. ‘పునర్నిర్మాణ కసరత్తు’లో భాగంగా దాదాపు 200 మంది వరకు ఉద్యోగులను తీసేసినట్టు సమాచారం. ఓలా క్యాబ్స్, దాని అనుబంధ సంస్థలైన ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓలా ఎలక్ట్రిక్లకు చెందిన వీరందరికీ ‘పింక్ స్లిప్’లు అందినట్టు ఓ తాజా నివేదిక చెప్తున్నది. వీరిలో చాలామందిని ఈమధ్యే వివిధ కళాశాలల నుంచి ఉద్యోగాల్లోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది.
మరోవైపు ‘పనితీరును మెరుగుపర్చడానికి ఇటువంటి పునర్నిర్మాణ కసరత్తులను మేము సాధారణంగా నిర్వహిస్తూంటాం. క్రమం తప్పకుండా సాగే ఈ ప్రక్రియలో అనవసరమైన ఉద్యోగులను తీసేస్తూంటాం. అయితే మళ్లీ తిరిగి నియామకాలనూ చేపడుతాం. ఇంజినీరింగ్, డిజైన్తోపాటు మా ప్రాధాన్య రంగాల్లో ఖాళీల భర్తీకి పెద్దపీట వేస్తాం’ అని ఓలా అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. అయితే ఈసారి ఎంతమంది ఉద్యోగాలను కోల్పోయారన్నదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. నిజానికి గత ఏడాది సెప్టెంబర్లోనే సుమారు 200 మంది ఉద్యోగులను తీసేసే యోచనలో ఉన్నట్టు సాఫ్ట్బ్యాంక్ నేతృత్వంలోని ఓలా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే ఈ వారమే తమ నియోబ్యాంకింగ్ సంస్థ అవైల్ ఫైనాన్స్ సేవలనూ ఓలా ఆపేసింది. నిరుడు మార్చిలో దీన్ని ఈ బెంగళూరు సంస్థ సొంతం చేసుకున్న సంగతి విదితమే. తమ అనుబంధ సంస్థ ఓలా మనీలో అవైల్ ఫైనాన్స్ను విలీనం చేయాలన్న ఆలోచనలో ఓలా ఉన్నది. అందుకే నియోబ్యాంకింగ్ వేదిక ద్వారా రుణాలను నిలిపేసినట్టు చెప్తున్నారు. కాగా, మార్కెట్లోని ప్రతికూల పరిస్థితుల మధ్య వ్యయ నియంత్రణలో భాగంగానే ఓలా ఈ కోతలకు దిగిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2020లోనూ కరోనా దెబ్బకు 1,400 మంది ఉద్యోగులను ఓలా తీసేసింది. పెట్టుబడుల కొరత కూడా ఇందుకు దారితీస్తున్నది.