IDBI Assistant Managers | మహారాష్ట్ర రాజధాని ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా 600 అసిస్టెంట్ మేనేజర్లను నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 28 వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 28 నాడే దరఖాస్తులు సవరించుకోవడానికి గడువు ఉంది. వచ్చేనెల 15 లోపు దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకోవచ్చు. ఏ డిగ్రీ పూర్తి చేసుకున్నా.. నిర్ణీత పని అనుభవం గల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది.
ఖాళీగా ఉన్న అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ పోస్టుల్లో జనరల్ క్యాటగిరీలో 244, ఎస్సీలకు 190, ఎస్టీలకు 17, ఓబీసీలకు 89, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 89 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో దివ్యాంగులకు 32 పోస్టులను రిజర్వు చేసింది ఐడీబీఐ బ్యాంక్.
బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ (మైక్రో ఫైనాన్స్ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఫిన్ టెక్ కంపెనీలు, బీమా రంగాల్లో కనీసం రెండేండ్లపాటు పని చేసే అనుభవం కావాలని ఐడీబీఐ బ్యాంకు తన నోటిఫికేషన్లో వెల్లడించింది.
దరఖాస్తుల వయస్సు గత నెల ఒకటో తేదీ నాటికి 21-30 ఏండ్ల మధ్య ఉండాలి. 1993 జనవరి రెండో తేదీ నుంచి 2002 జనవరి ఒకటో తేదీ లోపు జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిబంధనల ప్రకారం అభ్యర్థుల వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని ఐడీబీఐ బ్యాంకు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200, జనరల్ అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
ఆన్లైన్ పరీక్ష, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూతోపాటు ఫ్రీ-రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ప్రకారం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఐడీబీఐ వివరించింది.
మొత్తం 200 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. 200 ప్రశ్నలకు జవాబులు రాయాలి. లాజికల్ రీజనింగ్, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ విభాగంలో 60 ప్రశ్నలు, ఇంగ్లిష్ 40, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 40 ప్రశ్నలు ఉంటాయి. ఇంకా జనరల్ లేదా ఎకానమీ లేదా బ్యాంకింగ్ అవేర్ నెస్ లేదా కంప్యూటర్ లేదా ఐటీ విభాగం నుంచి 60 ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్షల్లో నెగెటివ్ మార్కులు వర్తిస్తాయి. ప్రతి నాలుగు ప్రశ్నలకు సమాధానాలు తప్పు అయితే ఒక మార్క్ కట్ అవుతుంది.