న్యూఢిల్లీ, జనవరి 9: జీడీపీ వృద్ధి అంచనాలు మెరుగుపడటంతోపాటు వడ్డీ రేట్ల బాట పట్ల స్పష్టత రావడంతో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మాన్ శాక్స్ నిఫ్టీ-50 లక్ష్యాన్ని పెంచింది. ఈ ఏడాది చివరికల్లా 23,500 పాయింట్లకు చేరుతుందని తాజా అంచనాల్లో వెల్లడించింది. నవంబర్ నెలలో విడుదల చేసిన 21,800 పాయింట్ల లక్ష్యాన్ని కేవలం రెండు నెలల్లోనే పెంచింది. మంగళవారం నిఫ్టీ ముగింపు విలువ 21,545 పాయింట్లతో పోలిస్తే 2024 చివరినాటికి మరో 8.5 శాతం ర్యాలీని గోల్డ్మాన్ శాక్స్ అంచనా వేస్తున్నది.
గత రెండు నెలలుగా అంతర్జాతీయ స్థూల ఆర్థిక వాతావరణం సానుకూలంగా మారిందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ పేర్కొంటూ యూఎస్ వృద్ధి పటిష్ఠంగా ఉంటుందని, యూఎస్, ఇతర ఆసియా దేశాల్లో వడ్డీ రేట్ల కోతలు త్వరితంగా జరుగుతాయని, డాలరు విలువ మరింత తగ్గుతుందన్న అంచనాలు నెలకొన్నాయని వివరించింది. అక్టోబర్ కనిష్ఠస్థాయి నుంచి 15 శాతం ర్యాలీ జరపడం ద్వారా పలు సానుకూల అంశాల్ని మార్కెట్ పాక్షికంగా డిస్కౌంట్ చేసుకున్నప్పటికీ, మెరుగైన వృద్ధి, రేట్ల కోతల అంచనాలతో నిఫ్టీ ఇండెక్స్ టార్గెట్ను పెంచుతున్నట్టు గోల్డ్మాన్ తెలిపింది.
కార్పొరేట్ లాభాల్లో 20 శాతం వృద్ధి
భారత్లో కార్పొరేట్ల లాభాలు ఈ ఏడాది కూడా రెండంకెల్లో వృద్ధిచెందుతాయని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంచనా వేసింది. 2023లో ఎంఎస్సీఐ ఇండియా ఇండెక్స్లో ఉన్న కంపెనీల లాభాల వృద్ధి అంచనా 20 శాతంకాగా, 2024లో 15 శాతం, 2025లో 14 శాతం చొప్పున పెరుగుతాయని భావిస్తున్నట్టు తెలిపింది. వృద్ధి అన్ని రంగాల్లోనూ ఉంటుందని, కార్పొరేట్ల ఆదాయ, లాభాల వృద్ధితో రానున్న సంవత్సరాల్లో ఇండెక్స్ రాబడులు పెరుగుతాయని పేర్కొంది.
అమ్మకాల ఒత్తిడిలో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు చివరి గంటలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో భారీ లాభాలను నిలుపుకోలేకపోయింది. ఇంట్రాడేలో 680 పాయింట్లు పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 30.90 పాయింట్లు అందుకొని 71,386.21 వద్దకు చేరుకోగా, నిఫ్టీ కూడా 31.95 పాయింట్లు ఎగబాకి 21,544.85 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సూచీ 211.45 పాయింట్లు పెరిగిన విషయం తెలిసిందే.
మార్కెట్లో లార్సెన్ అండ్ టుబ్రో షేరు 1.55 శాతం బలపడి టాప్ గెయినర్గా నిలిచింది. దీంతోపాటు భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీ, టాటా మోటర్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, నెస్లె, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే రియల్టీ 2.52 శాతం, పవర్ 1.10 శాతం, ఆటో 1.02 శాతం, హెల్త్కేర్, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు మదుపరుల మద్దతు లభించింది. కానీ, ఎఫ్ఎంసీజీ, టెలికం, బ్యాంకింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్ షేర్లు నష్టపోయాయి.