న్యూఢిల్లీ, జూలై 6: పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ఉత్పత్తులతోపాటు అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గడంతో దేశీయంగా బంగారం ధర రూ.52 వేల దిగువకు తగ్గింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.760 దిగి రూ.51,300 వద్ద ముగిసింది. పసిడితోపాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ళు పూర్తిగా నిలిచిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,280 తగ్గి రూ.58,200 నుంచి రూ.56,930కి తగ్గింది. అటు హైదరాబాద్లోనూ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.540 తగ్గి రూ.51,930కి దిగిరాగా, 22 క్యారెట్ల ధర రూ.500 తగ్గి రూ.47,600 వద్ద నిలిచింది. మరోవైపు, కిలో వెండి కూడా రూ.2,200 తగ్గి రూ.6,2700కు దిగింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,740 డాలర్ల వద్ద, వెండి 19.94 డాలర్ల వద్ద ఉన్నది.