Gold Rate Hike | పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకు ధర సరికొత్త గరిష్ఠాలను తాకుతున్నది. ధరల పెరుగుదలతో బంగారం అంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బుధవారం బంగారం ధర తులానికి రూ.440 పెరిగింది. ఏప్రిల్ ఫ్యూచర్స్లో పసిడి జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.69,487కి చేరుకుతున్నది. క్రితం సెషన్ ముగింపు ధరతో పోలిస్తే పోలిస్తే 0.64 శాతం పెరిగి రూ.69,369 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో ఎంసీఎక్స్లో సిల్వర్ ఫ్యూచర్స్ ఏకాలంలో రెండు సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. కిలోకు రూ.77,957కు పెరిగింది. డాలర్ ఇండెక్స్ క్షీణించడం, యూఎస్ ఫెడలర్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి.
డాలర్ ఇండెక్స్ (DXY) ప్రస్తుతం 104 మార్క్కు ఎగువన కొనసాగుతున్నది. కామెక్స్లో గోల్డ్ ఫ్యూచర్స్ ట్రాయ్ ఔన్స్కి 2,308 డాలర్ల వద్ద గరిష్ఠ స్థాయికి చేరింది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతల కారణంగా బంగారం సానుకూలంగా ట్రేడవుతోంది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనూజ్ గుప్తా మాట్లాడుతూ.. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై ఆశలున్నాయని.. ఈ క్రమంలోనే ఇటీవల ధరలు పెరుగుతున్నాయన్నారు. కామెక్స్లో బంగారం 2,320 నుంచి 2,400 డాలర్లకు చేరుకోవచ్చన్నారు. ఎంసీఎక్స్లో 73,555 రేంజ్లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్లలోని ధరల పెరుగుదల దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నది. బులియన్ మార్కెట్లో బుధవారం 22 క్యారెట్ల గోల్డ్పై రూ.750 పెరిగి తులానికి రూ.64,100కి పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.760 పెరిగి తులం రూ.69,870కి చేరింది. అదే సమయంలో వెండి ధర సైతం భారీగానే పెరిగింది కిలోకు ఏకంగా రూ.2వేలు పెరిగింది. దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే… ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.64,250 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.70,020కి పెరిగింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.65వేలు ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.70,910కి చేరింది. ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో 22 క్యారెట్ల పసిడి రూ.64,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.69,870కి పెరిగింది.
ఇక హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.64,100 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.69,870కి ఎగిసింది. కేరళ, బెంగళూరు, కోల్కతా, విజయవాడ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర సైతం బంగారంతో నువ్వానేనా అన్నట్లుగా పోటీపడుతున్నది. బుధవారం ఒకే రోజు రూ.2వేల ధర పెరగ్గా.. కిలోకు రూ.81వేల మార్క్ను అందుకున్నది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో బంగారం రూ.84వేలకు చేరింది. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతుండడంతో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండడంతో ధరలు రోజురోజు పైపైకి చేరుతుండడంతో బంగారం అంటేనే జంకే పరిస్థితి ఏర్పడుతున్నది.