రూ.890 పెరిగిన కిలో వెండి
న్యూఢిల్లీ, ఆగస్టు 17: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలు ప్రియంకావడం, రూపాయి క్షీణించడంతో దేశీయంగా ధరలు ఎగబాకాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పసిడి ధర రూ.450 పెరిగి రూ.46,460 పలికింది. అంతకుముందు ధర రూ.46 వేలుగా ఉన్నది. పసిడితోపాటు వెండి కూడా అధికమైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ళు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.890 అధికమై రూ.62,450కి చేరుకున్నది. మరోవైపు, హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.210 పెరిగి రూ.48,220కి, 22 క్యారెట్ల ధర రూ.190 అధికమై రూ. 44,200కి చేరుకున్నది. రూ.400 పెరిగి కిలో వెండి రూ.68,600 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 1,793 డాలర్లు, వెండి 23.88 డాలర్లకు చేరుకున్నాయి.