న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బంగారం ధరలకు యుద్ధం సెగ గట్టిగానే తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నిలకడగా ఉన్న ధరలు భవిష్యత్తులో తీవ్ర ఊగిసలాట భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ వృద్ధిలో మందగమనం, మారుతున్న ద్రవ్య విధాన అంచనాల నేపథ్యంలో 2026లో బులియన్ మార్కెట్లో అస్థిరంగానే ఉన్నాయని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ ఒక నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ధరల్లో అడపాదడపా దిద్దుబాటుకు గురైతున్నప్పటికీ..సురక్షిత పెట్టుబడిగా మాత్రం పసిడి కొనసాగుతున్నదని తెలిపింది. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు బంగారం, వెండి ధరలు 10 శాతం వరకు లాభపడ్డాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుండటంతోపాటు క్రూడాయిల్ ధరలు దిగొస్తుండటం మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలకు మళ్లించే అవకాశాలు కూడా ఉన్నాయని బ్రోకరేజ్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, ధరలు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటంతో ఆభరణాలకు డిమాండ్ పడిపోయిందని నివేదిక పేర్కొన్నది. భౌతికంగా, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్, డిజిటల్ గోల్డ్, డెరివేటివ్లతోపాటు పెట్టుబడిదారులకు ఇప్పుడు బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని స్పష్టంచేసింది. ప్రస్తుతం బంగారం ధరలు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ఆధారంగా ట్రేడింగ్ జరుగుతున్నది.
బంగారంతోపాటు డిజిటల్ గోల్డ్కు కూడా ఆదరణ క్రమంగా పెరుగుతున్నది. ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతుండటంతో కొనుగోలుదారులు పసిడి నిల్వలకు మొగ్గుచూపకుండా డిజిటల్ రూపంలో కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈ అక్షయ తృతీయ రోజున ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్ కొనుగోలు ఊపందుకోనున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. బంగారంలో పెట్టుబడి పెట్టేవారిలో మార్పులు కనపడుతున్నాయని, ఈ శుభప్రదమైన అక్షయ తృతీయ రోజున తమ పెట్టుబడులను డిజిటల్ రూపంలోకి మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ అనలిస్ట్ మానవ్ మోదీ తెలిపారు.