న్యూఢిల్లీ, ఆగస్టు 24 : బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. గత కొన్ని రోజులుగా పుంజుకుంటు వచ్చిన పుత్తడి సోమవారం ఐదు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పెరుగడంతోపాటు అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ ముదురుతుండటంతో మదుపర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన గోల్డ్ వైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుకుంటున్నాయి.
అంతర్జాతీయ పరిణామాలతోపాటు దేశీయంగా పండుగ సీజన్ కూడా ప్రారంభంకావడంతో అమ్మకాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1.64 లక్షలు దాటింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి 99.9 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర రూ.900 ఎగబాకి రూ.1,64,400 పలికింది. గత వారంలో రూ.1,63,500గా ఉన్నది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. మార్చి 9న నమోదైన రూ.1,64,300 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం.
బంగారంతోపాటు వెండి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు రిటైల్ విక్రయాలు అధికమవడంతో కిలో వెండి రూ.2.53 లక్షలు దాటింది. గతవారం ముగింపుతో పోలిస్తే రూ.,3500 ఎగబాకి రూ.2,53,500 పలికింది. వరుసగా మూడు రోజులుగా వెండి రూ.10 వేలకు పైగా ఎగబాకినట్టు అయింది. అలాగే ఏప్రిల్ 17న నమోదైన రూ.2.53 లక్షల తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి. డాలర్ బలహీనపడటంతో ధరలు పెరిగాయని కొటక్ సెక్యూరిటీస్ రీసర్చ్ హెడ్ కైనత్ చైనావాలా తెలిపారు. రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, ద్రవ్యోల్బణ భయాలు కూడా ధరలు పెరుగడానికి కారణాలన్నారు. గోల్డ్ ధర 42.45 డాలర్లు లేదా ఒక్క శాతం ఎగబాకి 4,646.54 డాలర్లకు చేరుకోగా, వెండి 69 డాలర్ల వద్ద ఉన్నది.