న్యూఢిల్లీ : ఈ ఏడాది బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగగా 2023లో తులం బంగారం ఏకంగా రూ.62,000కు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ బలహీనపడటంతో పాటు వచ్చే ఏడాది అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశం ఉండటంతో బంగారం ధరలు పరుగులు పెడతాయని ఐసీఐసీఐ డైరెక్ట్ తాజా నివేదిక వెల్లడించింది. డాలర్ బలహీనం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటం, గ్లోబల్ జీడీపీ అంచనాలను ఐఎంఎఫ్ సవరించడం వంటి అంశాలు గ్లోబల్ కమాడిటీస్ మార్కెట్పై మిశ్రమ ప్రభావం చూపుతాయని ఐసీఐసీఐ డైరెక్ట్ రిపోర్ట్ పేర్కొంది.
పసిడి ధరల మంట ఎందుకంటే..!
2022 మార్చిలో బంగారం ధరలు రికార్డు స్ధాయిలో ఔన్స్ 2000 డాలర్లకు ఎగబాకినప్పటి నుంచి ద్రవ్యోల్బణం పెరగడం, రాజకీయ, భౌగోళిక సంక్షోభం తలెత్తినా ఏడాది పొడవునా బంగారం ధరలు నిలకడగా తగ్గుతూ వచ్చాయని తెలిపింది. అయితే వచ్చే ఏడాది ఆర్ధిక మాంద్య భయాలతో ప్రజలు బంగారం కొనుగోలు చేసి నిల్వ ఉంచుకునేందుకు మొగ్గుచూపడంతో 2023లో పసిడికి ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ ఊపందుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారమే భరోసా..!
పలు దేశాల కేంద్ర బ్యాంక్లు సైతం రిసెషన్ భయాలతో బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తాయని భావిస్తున్నారు. రిసెషన్ వెంటాడుతుండటం, అంతర్జాతీయ అనిశ్చితి పరిస్ధితులతో 2023లో బంగారం మెరుపులు ఖాయమని ఐసీఐసీఐ డైరెక్ట్ నివేదిక స్పష్టం చేసింది. ఆర్ధిక సంక్షోభం, భౌగోళిక, రాజకీయ అనిశ్చిత వాతావరణంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారమే భరోసా ఇస్తుందని మదుపరులు భావించడం కూడా స్వర్ణానికి డిమాండ్ ఊపందుకుంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇక గతానుభవాలను చూసినా 1973 నుంచి అమెరికాను ఏడు సార్లు ఆర్ధిక మాంద్యం చుట్టుముట్టగా ఐదు సందర్భాల్లో బంగారం ధరలు ఎగబాకాయని నివేదిక గుర్తుచేసింది. ఆర్ధిక మాంద్యం వెంటాడటం, అధిక ద్రవ్యోల్బణం, డాలర్ బలహీనం, అనిశ్చిత రాజకీయ, భౌగోళిక పరిస్ధితుల కారణంగా 2023లో బంగారం ధరలు మరింత భారమవుతాయని కొటాక్ సెక్యూరిటీస్ కమాడిటీ రీసెర్చ్ హెడ్ రవీంద్ర వీ. రావు పేర్కొన్నారు.