న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: బంగారం ధరలు మళ్లీ ప్రియమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి శుక్రవారం భారీగా పుంజుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలుండటం, మదుపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపడంతో వీటి ధరలు రివ్వున ఎగిశాయి. నూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.1,600 ఎగబాకి రూ.1,56,600కి చేరుకున్నది.
గురువారం ఈ ధర రూ.1.55 లక్షలుగా ఉన్నది. ఇటీవల కాలంలో తగ్గుముఖం పట్టిన అతి విలువైన లోహాల ధరలు తిరిగి పుంజుకున్నాయని, డాలర్, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను అతి విలువైన లోహాలకు మళ్లించడం ఇందుకు కారణమని లెమన్ రీసర్చ్ బ్రోకరేజ్ హెడ్ గౌరవ్ గార్గ్ తెలిపారు.
బంగారంతోపాటు వెండి పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల కొనుగోలుదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.5 వేలు పుంజుకున్నది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి కిలో ధర రూ.2.47 లక్షలు పలికింది. అంతకుముందు ఇది రూ.2.42 లక్షలుగా ఉన్నది. గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు 101 డాలర్లకు పడిపోవడం ధరల్లో జోష్ పెంచింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 51 డాలర్లు లేదా 1.17 శాతం ఎగబాకి 4,392.78 డాలర్లకు చేరుకోగా, వెండి 3 శాతం ఎగబాకి 67.21 డాలర్లు పలికింది.