న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బంగారం ధరలు తగ్గాయి. ఇన్నాళ్లూ రోజుకింత పెరుగుతూ ఆల్టైమ్ హైల్లో గోల్డ్ రేట్లు నిలిచిన విషయం తెలిసిందే. అయితే గురువారం హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో మేలిమి బంగారమైన 24 క్యారెట్ 10 గ్రాముల విలువ రూ.330 దిగి రూ.73,800 పలికింది. నగల బంగారం 22 క్యారెట్ కూడా తులం రూ.300 పడిపోయి రూ. 67,650 వద్ద నిలిచింది. ఢిల్లీలో రూ.250 క్షీణించి రూ.73,700గా నమోదైంది. మంగళవారం హైదరాబాద్లో తులం 24 క్యారెట్ పుత్తడి రేటు తొలిసారి రూ.74వేల మార్కును దాటి రూ.74,130 పలికిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే గ్లోబల్ మార్కెట్లోనూ ఔన్సు 13 డాలర్లు పతనమై 2,375 డాలర్లుగా ఉన్నది. వెండి మాత్రం స్వల్పంగా పెరిగి 28.25 డాలర్లుగా నమోదైంది. దేశీయ మార్కెట్లో మాత్రం కిలో వెండి ధర రూ.86,500 వద్ద యథాతథంగా కొనసాగుతున్నది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్.. ద్రవ్యోల్బణం దృష్ట్యా వడ్డీరేట్లను తగ్గించడానికి మరింత సమయం తీసుకుంటుందన్న అంచనాల నడుమ గోల్డ్ మార్కెట్ కుదుపునకు గురైందని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.