న్యూఢిల్లీ, జూన్ 11 : బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజూ గురువారం కూడా ధరలు భారీగా పడిపోయాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మదుపర్లు సెంటిమెంట్ నీరుగారడంతో బులియన్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.2,100 తగ్గి రూ.1,53,900గా నమోదైంది. అంతకుముందు ఇది రూ.1.56 లక్షలుగా ఉన్నది. కానీ, వెండి ధరలు యథాతథంగా ఉన్నాయి. కిలో వెండి రూ.2,45,700 వద్ద కొనసాగుతున్నది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దీర్ఘకాలికంగా కొనసాగుతుండటంతో ఇంధన ధరలు పెరుగడం, ద్రవ్యోల్బణం కోరలు చాసే అవకాశం ఉండటంతో బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి మదుపర్లు జంకుతున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,072.21 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి 63.18 డాలర్లకు పడిపోయాయి.