న్యూఢిల్లీ, జూన్ 23: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, దేశీయంగా కొనుగోళ్లు అంతం త మాత్రంగానే ఉండటంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర రూ.370 తగ్గి రూ.59,180కి దిగొచ్చింది. అంతకుముందు ధర రూ.59,550గా ఉన్నది. పసిడితోపాటు వెండి తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రూ.550 తగ్గిన కిలో వెండి రూ.70,950కి దిగింది. ఇటు హైదరాబాద్లోనూ రూ.430 తగ్గిన 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.59 వేలకు పడిపోగా, 22 క్యారెట్ల ధర రూ.400 దిగి రూ.54,100కి చేరుకున్నది.
కిలో వెండి ఏకంగా రూ.1,000 తగ్గి రూ.74 వేల స్థాయికి పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,916 డాలర్లకు, వెండి 22.30 డాలర్లకు జారుకున్నది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ వడ్డీరేట్లను అర శాతం పెంచడంతో గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ ధర మూడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. ద్రవ్యోల్బణం కారణంగా మరిన్ని సెంట్రల్ బ్యాంక్లు వడ్డీరేట్లను తగ్గించడానికి సిద్ధమవుతుండటం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని ఆయన తెలిపారు.