హైదరాబాద్, నవంబర్ 11: అంతర్జాతీయ ట్రెండ్ను అనుసరిస్తూ దేశంలో బంగారం ధర ఒక్కసారిగా భగ్గుమంది. హైదరాబాద్లో చాలా నెలల తర్వాత రూ.50 వేలస్థాయిని మించింది. గురువారం ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.760 పెరిగి, 50,070 వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.700 మేర ఎగసి రూ. 45,900 స్థాయిని అందుకుంది. క్రితం రోజు ఈ ధరలు వరుసగా రూ. 49,310, రూ.45,200 స్థాయిలో ఉన్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఈ అక్టోబర్ నెలలో 6.2 శాతం పెరిగిందన్న వార్తలతో ఇన్వెస్టర్లు పుత్తడి కొనుగోళ్లకు ఎగబడ్డారు. దీంతో ప్రపంచ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర ఐదు నెలల గరిష్ఠ స్థాయి 1,860 డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది జూలై 21 తర్వాత పుత్తడి ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఇదేబాటలో భారత్లోని మల్టీ కమోడిటీ ఎక్సేంజ్లో 10 గ్రాముల పుత్తడి ధర 9 నెలల గరిష్ఠం రూ.49,277 వద్దకు ఎగిసింది. ప్రపంచ మార్కెట్లో పుత్తడి పెరగడంతోపాటు, ఇక్కడ రూపాయి విలువ 18 పైసలు తగ్గడంతో స్థానికంగా బంగారం ధర ఎక్కువశాతం పుంజుకుందని బులియన్ ట్రేడర్లు తెలిపారు. ద్రవ్యోల్బణం పెరిగినపుడు సురక్షిత పెట్టుబడి సాధనంగా పుత్తడిని ఇన్వెస్టర్లు పరిగణిస్తారు.
రూ.1,300 పెరిగిన వెండి…
పుత్తడి బాటలోనే వెండి ధర సైతం జోరుగా పెరిగింది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.1,300 మేర పుంజుకుని, రూ. 70,600కు చేరింది. క్రితం రోజు ఇది రూ. 69,300గా ఉంది. ప్రపంచ మార్కెట్లో వెండి ఔన్సు ధర 25 డాలర్ల స్థాయిని దాటింది.
పుత్తడి ఈటీఎఫ్ల్లోకి 303 కోట్లు
పండుగ సీజన్ నేపథ్యంలో అక్టోబర్లో గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడె డ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) ఇన్వెస్టర్ల పెట్టుబడుల్ని ఆకర్షించాయి. ఈ నెలలో ఈటీఎఫ్ల్లోకి రూ.303 కోట్ల నిధులు నికరంగా తరలివచ్చాయి. అయితే ఈ ఏడాది సెప్టెంబర్లో వచ్చిన రూ.446 కోట్ల కంటే అక్టోబర్లో ఈటీఎఫ్ల్లో తక్కువగానే పెట్టుబడులు పెట్టారు. సెప్టెంబర్కంటే అక్టోబర్లో పుత్తడి ధర పెరగడంతోనే పెట్టుబడులు తక్కువగా వచ్చాయని మార్నింగ్స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్ష్ శ్రీవాస్తవ చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకూ బంగారం ఈటీఎఫ్లు రూ. 3,818 కోట్ల నిధుల్ని ఆకర్షించాయి. ఒక్క జూలై నెల మినహా అన్ని నెలల్లోనూ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు తరలి వచ్చా యి. జూలైలో మాత్రం రూ.61 కోట్లు తరలివెళ్లాయి. కాగా దేశంలోని పుత్తడి ఈటీఎఫ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తులు రూ. 17,320 కోట్లకు చేరాయి.