న్యూఢిల్లీ: బంగారం ధరలు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. మరోమారు బంగారం ధర పడిపోయింది. ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన టైం అని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. సోమవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో అక్టోబర్ ఫ్యూచర్స్లో తులం బంగారం ధర రూ.402 తగ్గి రూ.46,238కి చేరుకున్నది.
గతేడాది కరోనా మహమ్మారి వేళ ఇన్వెస్టర్లు భారీగా బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపారు. తత్ఫలితంగా గత ఏడాది ఆగస్టు ఎంసీఎక్స్లో పది గ్రాముల బంగారం ధర ఆల్టైం రికార్డుతో రూ.56,191 పలికింది. గతేడాది బంగారంపై పెట్టుబడులు 43 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. దీంతో పోలిస్తే ప్రస్తుతం పసిడి ధర 25 శాతం తగ్గుముఖం పట్టింది. ఎంసిఎక్స్లో తులం బంగారం ధర రూ.46,238గా ఉంది. అంటే గతేడాదితో పోలిస్తే తులం బంగారం ధర రూ.9,953 తగ్గిందన్న మాట.
అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.317 తగ్గి రూ.45,391కి చేరుకున్నది. ఇంతకుముందు సెషన్లో తులం బంగారం ధర రూ.45,708 పలికింది. మరోవైపు కిలో వెండి రూ.1,128 తగ్గి రూ.63,700 లకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1749 డాలర్లు పలికింది. వెండి స్వల్పంగా తగ్గి 23.91 డాలర్లకు పడిపోయింది.