న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర ( Gold rate ) రూ.176 పెరిగి రూ.47,881కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం 24 క్యారట్ గోల్డ్ ధర రూ.47,705 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరుగడమే ఇవాళ దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
కాగా, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.505 తగ్గి రూ.61,005కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.61,510 వద్ద ముగిసింది. అదేవిధంగా ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ అమెరికన్ డాలర్తో పోల్చితే తొమ్మిది పైసలు కోల్పోయి 74.24 రూపాయలకు చేరుకుంది. ఇక అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 1,822 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.03 అమెరికన్ డాలర్లు పలికింది.