న్యూఢిల్లీ, జూన్ 22: గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పుంజుకోవడం, రూపాయి బలహీనంగా ఉండటంతో ధరలు పెరిగాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కె ట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,700 ఎగబాకి రూ.1,52,300కి చేరుకున్నట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడింది. అంతకుముందు ఇది రూ.1,50,600గా ఉన్నది. బంగారంతోపాటు వెండి ధరలు భారీగా పెరిగాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.4,800 అందుకొని రూ.2,45, 500 పలికింది.
అంతక్రితం నాలుగు రోజుల్లో వెండి రూ.8 వేలు తగ్గి రూ.2,40,700కి పడిపోయిన విషయం తెలిసిందే. అమెరికా వడ్డీరేట్లు సుదీర్ఘకాలంపాటు అధికంగా ఉంటాయనే అంచనాలు, పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు మెరుగుపడుతుండటంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు అధికమయ్యాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 49.93 డాలర్లు లేదా 1.2 శాతం అధికమై 4,210.19 డాలర్లకు చేరుకోగా, వెండి 2.4 శాతం అందుకొని 66.47 డాలర్లకు చేరుకున్నది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతిచర్చలు కూడా ధరలు పెరుగడానికి ప్రధాన కారణమన్నారు.