హైదరాబాద్, జూలై 1: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధరలు మూడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. శనివారం బులియన్ మార్కెట్లో తులం ధర రూ.58,850కి తగ్గింది. అలాగే 22 క్యారెట్ల ధర రూ.53,950కి జారుకున్నది. జూన్ 21న రూ.60 వేల స్థాయిలో ఉన్న పుత్తడి ధర ప్రస్తుతానికి రూ.1,200 తగ్గినట్టు అయింది.
అమెరికా ఫెడరల్ రిజర్వు మరోసారి వడ్డీరేట్లను పెంచనున్నట్టు ప్రకటించడంతో అతి విలువైన లోహాల ధరలు దిగొచ్చాయి. ఈ సందర్భంగా మానేపల్లి జ్యూవెల్లరీ ఎండీ మురళీ కృష్ణ మాట్లాడుతూ.. ఇది తాత్కాలికం మాత్రమేనని, త్వరలో ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. ఆషాఢ మాసం కావడంతో ఆభరణాలకు డిమాండ్ లేకపోవడం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణమన్నారు. సమీప భవిష్యత్తులో బంగారం ధర రూ.58 వేల నుంచి రూ.61 వేల మధ్య స్థాయిలో కొనసాగనున్నదని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 1,927 డాలర్ల వద్ద ఉన్నది. మరోవైపు వెండి ధరలు నేల చూపులే చూస్తున్నాయి.