న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర కేవలం రూ.7 పెరిగి రూ.46,223కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల 24 క్యారట్ గోల్డ్ ధర రూ.46,216 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో స్తబ్దుగా ముగియడం, డాలర్ కాస్త బలహీనపడటం ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండటానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా ఇవాళ ఢిల్లీలో స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.377 పెరిగి రూ.60,864కు పెరిగింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.60,487 వద్ద ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ కూడా ఇవాళ 13 పైసలు బలపడి రూ.74.26కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,785 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.26 అమెరికన్ డాలర్లు పలికింది.