Gold Returns | బంగారం అంటే భారతీయ మహిళలకు ఇష్టం. పెండ్లిండ్లు, పండుగలు.. పర్వదినాల్లో బంగారం కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తారు. కుదరకపోతే తమకు ఉన్న ఆభరణాలే ధరిస్తారు. కానీ భారత్లో అవసరాలకు సరిపడా బంగారం లభించడం లేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవల్సిందే. అలా దిగుమతి చేసుకోవడాన్ని ప్రోత్సహించడానికే కేంద్రం దిగుమతి సుంకం భారీగా పెంచేసింది. దీనికి తోడు తాజాగా హమస్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు, కేంద్రీయ బ్యాంకులు భారీగా బంగారం నిల్వలు పెంచుకోవడం వంటి కారణాలతో బంగారం ఇన్వెస్టర్లకు ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా మారుతుంది.
అలా ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా బంగారం ఇన్వెస్టర్లకు 2022లో 19 శాతం రిటర్న్స్ అందించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ తొమ్మిది శాతం లాభాలందించింది. పరిస్థితులు ఇలాగే ఉంటే ఈ ఏడాది 20 శాతం వరకూ రిటర్న్స్ పొందొచ్చునని ఆర్థికవేత్తలు, బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర మూడు నెలల గరిష్ట స్థాయి 1978 డాలర్లు పలికింది. గత జూలై 20వ తేదీ తర్వాత గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ బంగారం ధర భారీగా పెరగడం ఇదే ప్రథమం.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో ఈ నెలలో పసిడి మరింత పిరమైంది. ఈ నెలలో ఇప్పటి వరకూ తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.2974 పెరిగింది. ఈ నెల 1న తులం బంగారం రూ.57,719 వద్ద నిలిస్తే.. తాజాగా రూ.60,693 పే చేయాల్సి వస్తున్నది. ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్న అమెరికా కీలక వడ్డీరేట్లు వచ్చే ఏడాది ద్వితీయార్థంలో తగ్గించడం ప్రారంభం కావచ్చు. అప్పుడు బంగారం ధరలకు రెక్కలొస్తాయని బులియన్ మార్కెట్ వర్గాల కథనం.
ఇదిలా ఉంటే 2018 ఆగస్టు 10వ తేదీన బంగారం తులం (24 క్యారట్స్) ధర రూ.29,486 ఉంటే, గత ఆగస్టు 10వ తేదీన రూ.58,947 పలికింది. దీనికి తోడు కేంద్రీయ బ్యాంకులు `డీ-డాలరైజేషన్` ప్రక్రియలో భాగంగా బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి. డాలర్పై ఆధారపడటం తగ్గించుకోవడమే డీ-డాలరైజేషన్.
ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి తోడు ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. రుణాలపై అమెరికా సీలింగ్ విధించడంతో గత మే నెల ప్రారంభంలో సిలీకాన్ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్ సూయిజ్ వంటి దిగ్గజ బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకున్నాయి. చైనా సెంట్రల్ బ్యాంకుతోపాటు పలు ప్రపంచ దేశాల కేంద్రీయ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ఇక దీపావళి వరకూ దేశీయ బులియన్ మార్కెట్లో గిరాకీ ఉండటం, పెండ్లిండ్లు కూడా వస్తుండటంతో బంగారానికి గిరాకీతోపాటు ధర కూడా పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.