Gold Imports | బంగారం అంటే మహిళలకు ఎంతో మక్కువ. భారతీయులు అధికంగా విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవాల్సిందే. దీని ప్రభావం దేశీయ వాణిజ్యంలో కరంట్ ఖాతా లోటు (సీఏడీ) పెరిగిపోతుంది. 2020-21తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు బంగారం దిగుమతి పలు రెట్లు పెరిగింది. దేశీయంగా డిమాండ్ పెరగడమే దీనికి కారణమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య దిగుమతులు సుమారు 24 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లాయి.
గతేడాది బంగారం దిగుమతులు 6.8 బిలియన్ల డాలర్లు జరిగాయని కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో బంగారం దిగుమతులు 601.4 మిలియన్ డాలర్ల నుంచి 5.11 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లాయి. బంగారం దిగుమతులు పెరగడంతో కరంట్ ఖాతాలోటు 2.96 బిలియన్ డాలర్ల నుంచి 22.6 బిలియన్ డాలర్లకు పెరిగింది.
మరోవైపు వెండి దిగుమతులు 15.5 శాతం తగ్గి 619.3 మిలియన్ డాలర్లకు చేరాయి. 2020తో పోలిస్తే 2021లో వెండి దిగుమతులు 9.23 మిలియన్ డాలర్ల నుంచి 552.33 మిలియన్ల డాలర్లకు పెరిగాయి. జ్యువెల్లరీ పరిశ్రమకు డిమాండ్ పెరగడంతో భారత్ అతిపెద్ద బంగారం దిగుమతి దారుగా నిలిచింది. మరోవైపు జెమ్స్ అండ్ జ్యువెల్లరీ దిగుమతులు 8.7 బిలియన్ డాలర్ల నుంచి 19.3 బిలియన్ డాలర్లకు పెరిగాయి.