న్యూఢిల్లీ, జనవరి 29: బంగారం దిగుమతులు మళ్లీ పుంజుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో భారత్ 35.95 బిలియన్ డాలర్ల విలువైన పసిడిని దిగుమతి చేసుకున్నది. క్రితం ఏడాది ఇదే కాలంలో దిగుమతైన 28.4 బిలియన్ డాలర్లతో పోలిస్తే 26.7 శాతం అధికమని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీంతో కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) మరింత పెరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. గత నెలలో పసిడి దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 156.5 శాతం పెరిగి 3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో తొలి తొమ్మిది నెలల్లో వాణిజ్యలోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 188.02 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇది 212.34 బిలియన్ డాలర్లుగా ఉన్నది. బంగారం వినిమయంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద దేశం భారత్ కావడం విశేషం. దేశీయంగా ఆభరణాలకు డిమాండ్ అధికంగా ఉండటం వల్లనే పసిడి దిగుమతులు భారీగా పుంజుకుంటున్నాయి. గత తొమ్మిది నెలల్లో జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతులు 16.16 శాతం తగ్గి 24.3 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.