ముంబై, జూలై 29: ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయంగా గోల్డ్ డిమాండ్ 19.2 శాతం పెరిగి 76.1 టన్నులుగా నమోదైంది. గతేడాది ఇదే వ్యవధిలో 63.8 టన్నులుగానే ఉన్నట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో నిరుడు దేశవ్యాప్త లాక్డౌన్ అమల్లో ఉండటం, వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు అంతంతమాత్రంగానే సాగడంతో నాటితో పోల్చితే నేడు కనిపిస్తున్న వృద్ధికి పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. నిజానికి ఈ ఏప్రిల్-జూన్లో అక్షయ తృతీయ, పెండ్లిండ్ల సీజన్లోనూ బంగారానికి డిమాండ్ ఆశించిన స్థాయిలో లేదని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్ పీటీఐకి తెలిపారు. ఈ క్రమంలోనే రాబోయే ధనత్రయోదశి, పండుగల సీజన్పైనే ఆశలన్నీ అని అభిప్రాయపడ్డారు. కాగా, గతేడాదితో చూస్తే ఈసారి దేశవ్యాప్త లాక్డౌన్ లేకపోవడం, ఆంక్షలతోనైనా వ్యాపారాలు నడువడం కాస్త ఊరటనిచ్చే అంశంగా డబ్ల్యూజీసీ పేర్కొన్నది. ఇక డబ్ల్యూజీసీ ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ క్యూ2-2021’ నివేదిక ప్రకారం విలువ ఆధారంగా గత ఏప్రిల్-జూన్తో చూస్తే ఈసారి డిమాండ్ 23 శాతం పెరిగినట్లు కనిపిస్తున్నది. రూ.26,600 కోట్ల నుంచి రూ.32,810 కోట్లకు పెరిగింది. ఈసారి దేశంలో నగల డిమాండ్ 25% పెరిగి 55.1 టన్నులుగా నమోదైంది. విలువ ప్రకారం 29 శాతం పుంజుకుని రూ.23,750 కోట్లకు చేరింది.
డబ్ల్యూజీసీ నివేదిక ముఖ్యాంశాలు