Gold | బంగారం అంటే భారతీయులకు.. ప్రత్యేకించి మహిళలకు ఎంతో ఇష్టం.. పండుగలు.. పెండ్లిండ్లు.. ఇతర శుభకార్యాలకు వీలైతే పిసరంత బంగారం కొనుక్కోవాలని ఆశిస్తారు.. ఆభరణాలు ధరించడానికి ఆసక్తి చూపుతారు. అంతే కాదు ఇన్వెస్ట్ మెంట్కు ఆల్టర్నేటివ్గానూ బంగారం కొనుగోలు చేస్తారు.. కానీ.. భారతీయుల్లో బంగారం పట్ల గిరాకీ తగ్గిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధర ఆల్టైం రికార్డులు నమోదు చేస్తున్నది. ముంబైలో పది గ్రాముల బంగారం ధర రూ.57 వేల మార్క్ దాటింది. గత నవంబర్ నుంచి నిలకడగా బంగారం ధర పెరుగుతున్నది. ఫలితంగా అక్టోబర్-డిసెంబర్ మధ్య బంగారం ఆభరణాల కొనుగోళ్లు 20 శాతం తగ్గాయి. 2021తో పోలిస్తే అక్టోబర్-డిసెంబర్ మధ్య ఆభరణాల కొనుగోళ్లు 344 టన్నుల నుంచి 276 టన్నులకు పడిపోయాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది. ఇన్వెస్ట్మెంట్ రూపంలో 79 టన్నుల నుంచి 56 టన్నుల (29 శాతం తగ్గుదల)కు పడిపోయింది.
కరెన్సీ రూపంలో బంగారం డిమాండ్ 15 శాతం తగ్గింది. 2021 డిసెంబర్ త్రైమాసికంలో రూ.1.49 లక్షల కోట్ల విలువైన బంగారం కొనుగోళ్లు జరిగితే, 2022 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో రూ.1.25లక్షల కోట్లకు పరిమితమైంది. ఆభరణాల కొనుగోళ్లు 13 శాతం పడిపోగా, ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో గిరాకీ 25 శాతం పతనమైంది. ఆభరణాల కొనుగోళ్లు రూ.1.15 లక్షల కోట్ల నుంచి రూ.లక్షకు, బంగారంపై పెట్టుబడుల్లో రూ.34,130 కోట్ల నుంచి రూ.25,730 కోట్లకు పడిపోయాయి. బంగారం దిగుమతులు 208 టన్నుల నుంచి 165 టన్నులకు దిగిపోగా, రీ సైక్లింగ్ ద్వారా ఆభరణాల తయారీ 20 టన్నుల నుంచి 30 టన్నులకు పెరిగింది.
భారత్లో గతేడాది పొడవునా బంగారం డిమాండ్ మూడు శాతం పడిపోయింది. 2021లో 797 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగితే ఈ ఏడాది 775 టన్నుల విక్రయాలే జరిగింది. 2021లో 611 టన్నుల ఆభరణాలు కొన్న భారతీయులు గతేడాది 600 టన్నులతోనే సరిపెట్టుకున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు 186 టన్నుల నుంచి 174 టన్నులకు పరిమితం అయ్యాయి.
బంగారం ఆభరణాల డిమాండ్ రూ.2.61 లక్షల కోట్ల నుంచి రూ.2.73 లక్షల కోట్ల (4 శాతం)కు పెరిగితే, ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఒక శాతం తగ్గి రూ.79,720 కోట్ల నుంచి రూ.78,860 కోట్లకు పరిమితమైంది. దూకుడుగా ధరలు పెరగడంతో బంగారం రీసైక్లింగ్ 30 శాతం ఎక్కువైంది. 2021లో 75 టన్నుల బంగారం రీ సైక్లింగ్ చేస్తే, 2022లో 98 టన్నులకు పెరిగింది. ఇక బంగారం దిగుమతులు 27 శాతం పడిపోయి 925 టన్నుల నుంచి 673 టన్నులతో సరిపెట్టుకున్నాయి.
పంటల దిగుబడి పెరుగుదల, ఆభరణాలపై సెంటిమెంట్తో భారత్లో డిసెంబర్ త్రైమాసికంలో బంగారానికి గిరాకీ పెరిగిందని ప్రపంచ స్వర్ణ మండలి భారత్ రీజనల్ సీఈవో సోమసుందరం పీఆర్ చెప్పారు. అయితే, దేశీయంగా బంగారం ధరలు ఆల్టైమ్ గరిష్టానికి చేరడంతో 2021తో పోలిస్తే గతేడాది గిరాకి రెండు శాతం తగ్గిందన్నారు. వాణిజ్య పరంగా గిరాకీ లేకున్నా, వినియోగదారుల్లో సెంటిమెంట్ బలహీనంగా ఉన్నా, అధిక సుంకాలు విధించినా.. ఆశ్చర్యకరరీతిలో బంగారానికి గిరాకీ కొనసాగిందని చెప్పారు.
వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులతోపాటు ఆర్బీఐ 2022లో బంగారం కొనుగోళ్లు పెంచిందని వార్తలొచ్చినా.. 2021తో పోలిస్తే.. 2022లో ఆర్బీఐ బంగారం కొనుగోళ్లు 57 శాతం తగ్గిపోయాయి. 2021లో 77.5 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిపితే, 2022లో 33.5 టన్నులకే పరిమితమైంది. స్వల్పకాలిక అంశాలు, సాధారణ వర్షపాతం నమోదుతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మళ్లీ పెరుగుతుందని డబ్ల్యూజీసీ ఇండియా రీజనల్ సీఈవో సోమసుందరం తెలిపారు. గృహిణుల సేవింగ్స్లోనూ బంగారానికే పెద్ద పీట వేస్తున్నారన్నారు. ప్రస్తుత త్రైమాసికంలో గిరాకీ మళ్లీ పుంజుకుంటుందని అంచనా వేశారు.