Gold Rates | దేశ రాజధాని ఢిల్లీలో బంగారం తులం (24 క్యారట్స్) ధర మంగళవారం రూ.60 వేల మార్క్ కు దిగి వచ్చింది. అంతర్జాతీయ బలహీనతల వల్ల బంగారం తులం ధర రూ.150 తగ్గి రూ.59,900 వద్ద ముగిసిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. సోమవారం తులం బంగారం (24 క్యారట్లు) రూ.60,050 పలికిన సంగతి తెలిసిందే.
మరోవైపు మంగళవారం కిలో వెండి ధర మరింతగా రూ.850 తగ్గి రూ.74,500 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరింత పతనం అయ్యాయి. ఔన్స్ బంగారం ధర 1912 డాలర్లకు పతనం కాగా, ఔన్స్ వెండి ధర 23.05 డాలర్లకు చేరుకున్నది. కామెక్స్ గోల్డ్ ధర రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి కీలక వడ్డీరేట్ల పెంపు కొనసాగిస్తామని అమెరికా ఫెడ్ రిజర్వ్, యూరోపియన్ బ్యాంక్ ప్రకటిస్తాయన్న అంచనాల మధ్య ఫారెక్స్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ బలోపేతమైంది. యూఎస్ డాలర్, యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ పెరిగిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
ఇదిలా ఉంటే, ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు మరింత పతనం అయ్యాయి. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో అక్టోబర్ డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్ తులం (24 క్యారట్స్) ధర రూ.113 తగ్గి రూ.58,588 వద్దకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో (న్యూయార్క్) ఔన్స్ బంగారం ధర 0.35 శాతం తగ్గి 1929.80 డాలర్ల వద్ద ముగిసింది.