న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 : గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగడంతో అతి విలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.3,200 లేదా 2.09 శాతం ఎగబాకి రూ.1,56,400 పలికింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.11 వేలు లేదా 5 శాతం ఎగబాకింది. అన్ని పన్నులు కలుపుకొని కిలో వెండి రూ.2.51 లక్షలకు చేరుకున్నది.
మంగళవారం ఈ ధర రూ.2.40 లక్షలుగా ఉన్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు మూడు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 97.48 డాలర్లు లేదా 2.07 శాతం ఎగబాకి 4,803.33 డాలర్లకు చేరుకోగా, వెండి ఆరు శాతం అందుకొని 77.33 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.