NPA | ముంబై, మార్చి 29: బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల విలువ మరింత తగ్గే అవకాశాలున్నాయని కేర్ రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది. 2024-25లో దేశీయ బ్యాంకుల స్థూల నిరర్థఖ ఆస్తుల విలువ 2.1 శాతానికి దిగిరావచ్చునని పేర్కొంది. 2023-24లో 2.5-2.7 శాతానికి తగ్గనున్న ఎన్పీఏలు..ఆ తర్వాతి ఏడాదిలో 2.1-2.4 శాతానికి పరిమితం కానున్నదని సంస్థ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2013-1లలో 3.8 శాతంగా ఉన్న బ్యాంకుల మొండి బకాయిలు 2017-18 నాటికి 11.2 శాతానికి పెరిగాయి.
దీంతో బ్యాంకుల మొండి బకాయిలపై రిజర్వుబ్యాంక్, కేంద్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేయడంతో వీటిని తగ్గించుకోవడానికి పలు చర్యలు తీసుకోవాలని సూచించాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో పలు బ్యాంకుల ఎన్పీఏలు పదేండ్ల కనిష్ఠ స్థాయి 3.9 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. బ్యాంకుల ఆస్తుల నాణ్యత ప్రమాణాలు పెరగడం, మొండి బకాయిలను వసూళ్ల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం కలిసొచ్చింది. రంగాలవారీగా చూస్తే వ్యవసాయ రంగంలో మొండి బకాయిలు 7 శాతానికి తగ్గగా, ఇండస్ట్రీయల్స్ రంగంలో 14.1 శాతం నుంచి 4.2 శాతానికి దిగొచ్చాయి.