హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంపోర్ట్ కొరియర్ టెర్మినల్ను ప్రారంభించారు. జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్ఏసీ) ఈ మేరకు బుధవారం ప్రకటించింది. వేగవంతమైన కార్గో ప్రాసెసింగ్, ఇంపోర్ట్ కొరియర్ క్లియరెన్స్కు ఇది దోహదం చేయగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా జీహెచ్ఏసీ వ్యక్తం చేసింది. ఇందుకు కస్టమ్స్ అధికారులు కృషి చేయనున్నట్టు తెలిపింది. కాగా, ప్రపంచస్థాయి సెక్యూరిటీ స్క్రీనింగ్, అత్యాధునిక కార్గో నిర్వహణ వ్యవస్థలతో 300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు.
ఈ టెర్మినల్లో కొరియర్ కార్గో దిగుమతులు నిరంతరం సాగనున్నాయి. ‘మా కస్టమర్లకు ప్రపంచ శ్రేణి లాజిస్టిక్ సేవల్ని అందించడానికి మేము చేస్తున్న కృషికి ఇదో నిదర్శనం’ అని జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ సీఈవో ప్రదీప్ ఫణికర్ అన్నారు. ఇదే స్ఫూర్తితో తమ సేవలను మరింత వేగవంతం చేస్తామన్నారు. జీహెచ్ఏసీ ప్రస్తుతం నెలకు 120 మెట్రిక్ టన్నులకుపైగా ఎగుమతి కొరియర్లను నిర్వహిస్తోంది. ఈ కొత్త టెర్మినల్తో దిగుమతి కొరియర్ సామర్థ్యం నెలకు 150 మెట్రిక్ టన్నులను తాకుతుందన్న విశ్వాసాన్ని జీహెచ్ఏసీ వెలిబుచ్చుతున్నది. ఈ క్రమంలోనే ఇకపై డాక్యుమెంట్లు, రెడిమేడ్ దుస్తులు, నమూనాలు, గృహోపకరణాలు, ఇంజినీరింగ్ వస్తూత్పత్తులు ఇక్కడ పెద్ద ఎత్తున ఎగుమతి-దిగుమతులవుతాయని చెప్తున్నారు.