హైదరాబాద్, మార్చి 19: భారత్లో తన వ్యాపార విస్తరణలో భాగంగా హిటాచీ గ్రూపునకు చెందిన గ్లోబల్లాజిక్ తాజాగా మహబూబ్నగర్లో శాటిలైట్ కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రాంతీయ మార్కెట్పై దృష్టి సారించడంలో భాగంగా కంటెంట్ ఇంజినీరింగ్ వ్యాపారాన్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని నెలకొల్పింది.
18 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ నూతన ఆఫీస్తో కొత్తగా 180 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని కంపెనీ వైస్ ప్రెసిడెంట్, ఎండీ పీయూష్ జా తెలిపారు. సాంకేతిక ఆవిష్కరణల పురోగతికి వేదికగా ఈ ఆఫీస్ పనిచేయనున్నదని, కంటెంట్ ఇంజినీరింగ్పై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు డాటా, జీఐఎస్ పరిష్కారాలు, ఆధునిక తరాలకు చెందిన ఏఐ ప్రాజెక్ట్ సహా పలు రకాల డొమైన్స్లో నాణ్యమైన సేవలు అందించడానికి వీలు పడనున్నదని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా హబ్ అండ్ స్పోక్ మాడల్ను కూడా పరిచయం చేస్తున్నట్లు, హబ్స్-టాలెంట్ హాట్స్పాట్స్కు సమీపంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ప్రతిభ ఉన్నవారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో టెక్నాలజీ, ఐటీ విద్యను ప్రోత్సహించడానికి, ప్రతిభను బయటకు తీయడానికి తెలంగాణ అకాడమీతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నట్లు చెప్పారు.