హఠాత్తుగా డాలర్ బలపడటం, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడంతో గత శుక్రవారం ప్రపంచ మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని చవిచూశాయి. అదే రోజు నిఫ్టీ సైతం 17,992 పాయింట్ల గరిష్ఠస్థాయి నుంచి పడిపోయింది. అయినప్పటికీ, వారం మొత్తం మీద 60 పాయింట్ల లాభంతో 17,758 పాయింట్ల వద్ద ముగిసింది. అదేపనిగా పెరగడంతో మార్కెట్ ఓవర్బాట్లోకి వెళ్లిందని, బుల్స్ అలసిపోయినట్లు టెక్నికల్ చార్టుల్లో కన్పిస్తున్నదని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోదీ చెప్పారు. అయితే ట్రెండ్ మాత్రం ఇంకా బుల్లిష్ ధోరణిలోనే ఉందని, తగ్గుదలను కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చని సూచించారు అంతర్జాతీయ ట్రెండ్లో వచ్చిన మార్పుతో పాటు వచ్చే వారం ఆగస్టు డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనున్నందున, స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు లోనుకావచ్చని విశ్లేషకులు అంటున్నారు.
17,700 దిగువన బలహీనం
వీక్లీ చార్టులో బేరిష్ ప్యాట్రన్ ఏర్పడినందున, ఈ వారం నిఫ్టీ 17,700 పాయింట్ల స్థాయిని కోల్పోతే బలహీనపడుతుందని ఎల్కేపీ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే తెలిపారు. ఆ సందర్భంలో రూ. 17,500-17,400 వరకూ తగ్గవచ్చన్నారు. 17,700 పైన నిలిస్తే 17,900-18,000 శ్రేణి వద్ద అవరోధాన్ని చవిచూడవచ్చన్నారు. జూన్ కనిష్ఠం నుంచి శుక్రవారంనాటి గరిష్ఠం వరకూ జరిగిన ర్యాలీలో 23.6 శాతం ఫిబోనకి రిట్రేస్మెంట్ స్థాయి అయిన 17,300 పాయింట్ల వరకూ ఒకట్రెండు వారాల్లో నిఫ్టీ తగ్గవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ నాగరాజ్ షెట్టి అంచనా వేశారు. 17,850 పాయింట్ల స్థాయి నిరోధించవచ్చని తెలిపారు. రానున్న రోజుల్లో 17,200 పాయింట్ల వద్ద నిఫ్టీకి మద్దతు ఉందని జిమిత్ మోదీ చెప్పారు.