సంస్కరణల తర్వాత దేశీయ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. అయినప్పటికీ ఈక్విటీ మార్కెట్లో మదుపు మాత్రం మూడు శాతం మందే చేస్తున్నారు. నిజానికి ప్రపంచ మార్కెట్లన్నింటిలోనూ మదుపు చేసే వెసులుబాటు మనకున్నది. పోర్ట్ఫోలియోలను డైవర్సిఫై చేయడానికి అవకాశాలూ భారీగా పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లలో మదుపు చేయడం ద్వారా రిస్క్ను తగ్గించుకోవడంతోపాటు, అదనపు రాబడులను పోర్ట్ఫోలియో ద్వారా పొందే వీలుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో సమయంలో ఒక్కో మార్కెట్ పనితీరు మిగతా మార్కెట్ల కన్నా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి స్తబ్దుగా ఉన్న మార్కెట్ల నుంచి మెరుగైన మార్కెట్లలోకి పెట్టుబడులను మళ్లించడం వల్ల ప్రయోజనాన్ని పొందవచ్చు. భారత మార్కెట్ గత 3 నెలలుగా స్తబ్దుగా ఉంటుండగా, అమెరికన్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి.
పెట్టుబడులు ఏదో ఒక రంగానికి, ఎక్కడో ఒక చోట పరిమితం కాకూడదు. గత 3, 5, 10 ఏండ్ల కాలపరిమితిలో అమెరికన్ మార్కెట్లు డాలర్లలో అధిక రాబడిని ఇచ్చాయి. రూపాయి విలువ పతనంతోనూ అమెరికన్ మార్కెట్లో మదుపు వల్ల రాబడి అధికంగా ఉంటున్నది. వారివారి పెట్టుబడి, రిస్క్లకు అనుగుణంగా అపారమైన అవకాశాలను గ్లోబల్ మార్కెట్లు అందిస్తున్నాయి. దేశీయ మార్కెట్లలో ఐటీ వంటి కొన్ని రంగాలు మాత్రమే అధిక రాబడిని ఇవ్వగలుగుతున్నాయి. అయితే విదేశాల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఇతర రంగాలూ మెరుగైన రాబడులను అందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న టెక్నాలజీ ఆధారిత ట్రెండ్స్, ముఖ్యంగా రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్చైన్, డిజిటల్ ఎకానమీ వంటి వాటిలో అపార మదుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత అంచనాలు, లక్ష్యం, రిస్క్ తీసుకునే సామర్థ్యానికి అనుగుణంగా గ్లోబల్ మార్కెట్లకు పొర్టుఫోలియో తగిన స్థానం కల్పించవచ్చు. నేరుగా స్టాక్స్లోనే కాకుండా ఈటీఎఫ్ లేదా ఈటీఎఫ్ ఆధారిత ఫండ్ ఆఫ్ ఫండ్స్లోనూ పెట్టుబడులు పెట్టవచ్చు. ఇది చాలా సులభం. పారదర్శకత, లావాదేవీల వ్యయం తక్కువగా ఉండటం అదనపు ఆకర్షణ. ఇటీవలికాలంలో మన దేశంలోనూ ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. విదేశీ మార్కెట్లలోని ఆయా రంగాల ఈటీఎఫ్లలో కూడా మదుపు చేయవచ్చు.
సిద్ధార్థ్ శ్రీవాస్తవ,
ప్రొడక్ట్స్-ఈటీఎఫ్ హెడ్, మిరేయ్ అసెట్
ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్